రాగం: లలితా
ఆ: స రి1 గ3 మ1 ద1 ని3 స
అవ: స ని3 ద1 మ1 గ3 రి1 స
తాళం: ఆది
పల్లవి
తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు ।
ఎప్పుడు లోకములెల్ల నేలేటివాడు ॥
చరణం 1
మోతనీటి మడుగులో యీతగరచినవాడు ।
పాతగిలే నూతిక్రింద బాయనివాడు । (2)
మూతిదోసిపట్టి మంటి ముద్ద పెల్లగించువాడు । (2)
రోతయైన పేగుల పేరులు గలవాడు ॥ (2)
తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు..(ప..)
చరణం 2
కోడికూత నోరివాని కుర్రతమ్ముడైనవాడు ।
బూడిద బూసినవాని బుద్ధులవాడు । (2)
మాడవన్నె లేడివెంట మాయలబడినవాడు । (2)
దూడల నావులగాచి దొరయైనవాడు ॥ (2)
తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు..(ప..)
చరణం 3
ఆకసానబారే వూరి అతివల మానముల ।
కాకుసేయువాడు తురగముపైవాడు । (2)
ఏకమై వేంకటగిరి నిందిరారమణి గూడి । (2)
యేకాలముబాయని యెనలేనివాడు ॥ (2)
తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు ।
ఎప్పుడు లోకములెల్ల నేలేటివాడు ॥